
ఇంద్రధనుస్సు ప్రతినిధి: గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం, మూడు ఆర్వో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతి పల్లె దవాఖానాలో వైద్యుడు తో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషిబా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండు, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, రాజు, వెంకన్న, తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.