

ఇంద్రధనుస్సు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యారంగంలో మెలుకువలు నేర్పిస్తున్నాయని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఐసిడిఎస్ మరియు అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉపాధ్యాయుల కోసం పటాన్ చెరు పట్టణంలోని అంగన్వాడి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక విద్య తరంగణి టీచర్స్ మేళాలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన నృత్య రూపకాలు, కథలు చెప్పడం, అక్షరాస్యత అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వ శిశు విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడంతోపాటు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం సేవలు అందించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం తరంగిణి కార్యక్రమం పేరుతో అంగన్వాడి ఉపాధ్యాయులకు నూతన విద్యా విధానం మెళుకువలు నేర్పించడంలో అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అందిస్తున్న సేవల పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఐసిడిఎస్ జిల్లా అధికారి లలిత కుమారి, సీడీపీవోలు జైరామ్ నాయక్, చంద్రకళ, సూపర్ వైజర్లు, అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.