
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. పరిశ్రమలలో పనిచేస్తున్న అసంఘటితరంగ కార్మికులకు 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.
మంగళవారం సిగాచి పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు లతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సందర్శించారు. దుర్ఘటన జరిగిన పరిశ్రమలోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పాశమైలారంలో వేలాది బల్క్ డ్రగ్స్, ఫార్మా, కెమికల్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా పలు పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించకుండా.. శిక్షణ లేని దినసరి కార్మికులతో రియాక్టర్లు, బాయిలర్లు నడిపిస్తున్నారని.. దీని మూలంగా భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. యాజమాన్యాల కక్కుర్తి మూలంగా కార్మికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేయాల్సిన దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి భవిష్యత్తులో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం అవుతున్నప్పటికీని.. ఇస్నాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ట్రామా కేర్ ద్వారా ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సత్వర వైద్యం అందించగలుగుతామని తెలిపారు.
అదే విధంగా దేశంలోని వివిధ రాష్ట్రాల కు చెందిన నిరుపేద ప్రజలు పొట్టకూటి కోసం స్థానిక పరిశ్రమలలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని.. వారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. 50 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించేలా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.