పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి! జలమండలి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: జలమండలి ఆధ్వర్యంలో ఓ ఆర్ ఆర్ ఫేజ్-2 పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రధానంగా బొల్లారం, బీరంగూడ, అమీనుపూర్, తెల్లాపూర్ పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. రాబోయే 15 రోజుల్లో పంపింగ్ పనులు సైతం పూర్తి చేసి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కాలుష్య జలాలతో ఇబ్బంది పడుతున్న బొల్లారం మున్సిపల్ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. పైపులైన్ల లీకేజీ విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి జిఎం సుబ్బారాయుడు, డీజీఎంలు చంద్రశేఖర్, శివకుమార్, ఏఈలు ప్రవీణ్, పూర్ణేశ్వరి, శ్రీనివాస్, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *