
ఇది అందరికీ తెలిసిన కధే అనుకుంటా..
మంచి మాటని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదే కదా అని…
ఒక బాబు చిన్నతనంలో, తల్లి దగ్గరికి వచ్చి తను దొంగిలించి
తెచ్చిన తోటకూర కట్టలను చూపించి, అమ్మా, నేను నీకు ఇవాళ
కూరల ఖర్చు తప్పించాను.. అని గొప్పగా చెప్పాడు.
అది విన్నఆ తల్లి, ఒక నిమిషం తటపటాయించి, ఏమనుకుందో ఏమో, సరే,
ఆ తోటకూర ఇలా ఇవ్వు బాబు.. అని కొడుకు దగ్గరనుంచి తోటకూర తీసుకుంది…
ఓహో , నేను చేసిన పని అమ్మకి నచ్చింది అనుకుని, వాడు అలా దొంగతనాలకి అలవాటు పడ్డాడు…
తల్లి కూడా కొడుకు ఎలా ఎదుగుతున్నాడో, అంతగా పట్టించుకోలేకపోయింది…
పెద్దయ్యాక, వాడొక పెద్ద దొంగ అయ్యాడు, ఒక పెద్ద దొంగతనంలో పోలీసులకి పట్టుబడ్డాడు..
జైల్లో పెట్టి పోలీసులు శిక్షిస్తున్నారు…
అంతలో తల్లి పరుగులు పెట్టుకుంటూ, బాధ పడుతూ పోలీస్ స్టేషన్ కి
వచ్చింది, ఒకటే ఏడుస్తూ పోలీసులకి చెప్తోంది.
” నా బాబు ఏ తప్పూ చెయ్యడు, వాడిని వదిలిపెట్టండి” అని…
అప్పుడు పోలీసులు..” వాడొక పెద్ద దొంగ,
వాడికి ఏ తప్పూ తెలీదు అని చెప్తావేంటి, కావాలంటే, వాడినే కనుక్కో ఫో..అని విసుక్కున్నారు..
అప్పుడు తల్లి ఏడుస్తూ, కొడుకు దగ్గరికి వచ్చింది,
” ఏం చెప్తున్నార్రా వీళ్ళు, నువ్వు దొంగవేవిట్రా ” అంటూ ఏడుస్తోంది…
అప్పుడు కొడుకు తల్లిని దగ్గరికి రమ్మని చెప్పి, తల్లి చెవిని గట్టిగా మెలిపెట్టాడు,
తల్లికి నొప్పి పుట్టినా వదల్లేదు. అప్పుడు తల్లి ” ఏమిట్రా, ఈ పిచ్చి పనులు.. అని విసుక్కుంది…
అప్పుడు వాడు తల్లితో ఒకటే మాట చెప్పాడు “అమ్మా, తోటకూర దొంగతనం నాడే, నువ్వు నా చెవిని ఇలా గట్టిగా మెలిపెట్టో, నన్ను కొట్టో…దొంగతనం తప్పురా” అని చెప్పుంటే ఈ రోజున నేనిలా దొంగనయ్యేవాడిని కాదు కదా.. అని తల్లిని మందలించాడు.
నేర్పాల్సిన,నేర్చుకోవాల్సిన బాల్యంలో,
సందర్భాన్ని బట్టి పిల్లలకి తల్లితండ్రులు ఒక మంచి మాటను చెప్పటం, ఒక మంచి పద్ధతి నేర్పటం ఎంత అవసరమో… నేర్పకపోతే పర్యవసానం ఏమిటో ఈ కధ చెప్పకనే చెబుతుంది.
-ఎస్. వెంకటేశ్వర రావు